సీఎం కేసీఆర్ కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వేదికగా కేంద్రంపై పోరాటం చెయ్యాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరమన్న ఆయన.. అధికారుల వ్యవహారశైలి కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉందని చెప్పారు. గత మూడు నెలలుగా తెలంగాణ రైతులు వరి ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఎంపీలు సేద తీరే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో దీక్ష చేస్తున్నట్లు వారు నటిస్తున్నారు మండిపడ్డారు.
టీఆర్ఎస్ ఎంపీల ప్రవర్తన చాలా చిల్లరగా ఉందన్నారు రేవంత్. కేసీఆర్, ఎంపీల ప్రకటనల వల్ల తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. మిల్లర్ల మాఫియాలో బందీ అయిన రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలును కుదించుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని.. 2018, 2019, 2020లలో ఎఫ్సీఐ ఇచ్చిన టార్గెట్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని చెప్పారు.
ఎఫ్సీఐ సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయం అయ్యాయని.. దీనికి భాధ్యులు ఎవరో సిబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు రేవంత్. వరంగల్ లో మాయం అయిన 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందంలో భాగంగా గులాబీ ఎంపీలు తమ నిరసనను ముగిస్తున్నారన్న ఆయన… తెలంగాణ రైతులు తమ ఎంపీలను నిలదీసి ప్రశ్నించాలన్నారు. అదాని, అంబానీలకు రైతాంగ ప్రయోజనాలను కేసీఆర్, మోడీ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ లకు తమ పదవుల్లో కొనసాగే హక్కు లేదన్నారు రేవంత్. కేంద్రం ఇచ్చిన టార్గెట్ తగ్గిస్తే దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, టమాటాలు, చీపుర్లతో కొట్టి సన్మానించాలన్నారు. తెలంగాణలో బియ్యం సేకరణలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి కేంద్రమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు తోడు దొంగలేనన్న ఆయన.. తెలంగాణలో రైతుల మరణాలకు కారణం అయిన పార్టీలు ఇప్పుడు సంతాపం చెబుతున్నాయని మండిపడ్డారు.