భారతదేశం ఆర్థికంగా శక్తివంతంగా నిలబడడానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కారణమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పీవీ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించారు. రేవంత్ వెంట అంజన్ కుమార్ సహా పలువురు నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్.. పీవీ సేవలను కొనియాడారు. భూ సంస్కరణలు తెచ్చి భూమి లేని పేదలకు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమని వివరించారు. ప్రతీ ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ అని కొనియాడారు.
మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో నర్సింహారావు సేవలు మరవలేనివన్నారు రేవంత్. దివంగత జైపాల్ రెడ్డి పీవీ అడుగుజాడల్లో నడిచారని గుర్తు చేశారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందన్న ఆయన.. పీవీ కుటుంబాన్ని తమ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందని తెలిపారు.
వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయన్న రేవంత్.. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పీవీ ఓ జాతి సంపద అని.. ఆయన వ్యక్తి కాదు శక్తి అంటూ కొనియాడారు.