బీజేపీ, బీఆరెస్ కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ నేతలు మాత్రమే కొట్లాడారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ పై పోరాటంలో బండి సంజయ్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.
ఎప్పటిలోగా కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి కేసీఆర్, కేటీఆర్ను జైల్లో పెడతారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రానైట్ను విదేశాలకు తరలించారని ప్రశ్నించిన బండి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు.
కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేందుకే వారు వేరుగా ఉన్నట్లు నటిస్తున్నారన్నారు. 60ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ గడ్డమీద సోనియా మాట ఇచ్చారని చెప్పారు. పార్టీ నష్టపోయినా మాట తప్పకుండా, మడిమ తిప్పకుండా తెలంగాణ ఏర్పాటు చేసి సోనియా మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.
వచ్చిన తెలంగాణలో 60 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరాయా? ఒక్కసారి ఆలోచించండని ప్రజలను కోరారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ తెలంగాణ కోసం కొట్లాడలేదన్నారు. వీళ్లు సుష్మా స్వరాజ్ను కలిసి ఒప్పించలేదన్నారు. ఆనాడు తెలంగాణ ప్రజల బాధను చెప్పి సుష్మాస్వరాజ్ కాళ్లకు దండం పెట్టి ఆమెను ఒప్పించింది తమ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ అని వెల్లడించారు.
బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డిని అమిత్ షా పిలిపించుకుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కోసం అని అనుకున్నానన్నారు. మూడుగంటలు కూర్చోబెట్టి ముచ్చట చెప్పిండు తప్ప చేసిందేం లేదన్నారు.
తెలంగాణలో మోడీ 70లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. 21కోట్ల దరఖాస్తులు వస్తే 7లక్షల 164 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో నిస్సిగ్గుగా చెప్పారని మండిపడ్డారు. మోడీ వచ్చాక రూ.400 సిలిండర్ రూ.1200 చేశారని ఫైర్ అయ్యారు.
రూ.50 ఉన్న డీజిల్ రూ.100 చేశాడని మండిపడ్డారు. బీజేపీ పేద ప్రజలకు చేసిన సాయం ఏమీ లేదన్నారు. అమిత్ షా ను కలిసిన ఈటల తెలంగాణ సమస్యలను ఆయనతో ఎందుకు ప్రస్తావించలేదు? అని ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధి బిల్లుకు చట్టబద్దత ఎందుకు చేయించలేదని అడిగారు.
కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకు ఎందుకు విచారణకు ఆదేశించాలని ఎందుకు అడగలేదన్నారు. సొంత నియోజకవర్గంలో మానేరు వాగులో ఇసుక దోపిడీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఇసుక మాఫియా హుజూరాబాద్లో రాజ్యమేలుతుంటే నువ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
ఆ దోపీడీలో నీకు వాటా ఉందా? నీ పాత కేసులు తవ్వుతారనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆరెస్ నేతలు గొప్పలు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వస్తాడా? మంత్రి వస్తాడా? ఏ సబ్ స్టేషన్ వద్దకైనా వెళదామని సవాల్ విసిరారు.
మీరు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. తాము రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగబోమన్నారు. లేకపోతే హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాయాలన్నారు. తెలంగాణలో సబ్బండవర్గాలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. హుజూరాబాద్లో బీఆరెస్ కు, బీజేపీకి అవకాశం ఇచ్చారని ఈ సారి ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి బల్మూరు వెంకట్ ను గెలిపించండని అభ్యర్థించారు.