కులాల, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ ఏర్పడిందని ఆయన అన్నారు. అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని పేర్కొన్నారు.
రాహుల్ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. మేడారం నుంచే ఈ యాత్రను మొదలు పెట్టడానికి ఓ కారణం ఉందన్నారు. నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు వనదేవతలు సమ్మక్క సారలమ్మ పోరాడారని చెప్పారు.
సమ్మక్క సారక్క కేవలం ఆదివాసులకే కాదని, అందరికీ ఆరాధ్య దైవమన్నారు. అందుకే ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యాంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ యాత్ర అన్నారు. చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్తో కాంగ్రెస్ను వైఎస్ అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే ఈ యాత్ర విజయవంతం అయినట్లేనన్నారు.
ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందన్నారు. తెలంగాణ కోసం అమరుల ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తోందన్నారు. అమరుల త్యాగాలపై ఈ ప్రభుత్వం మట్టి కప్పాలని చూస్తోందని మండిపడ్డారు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన సమ్మక్క సారక్క పోరాడిన గడ్డ ఇదన్నారు.
సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ ఇదన్నారు. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా?అని ఆయన ప్రశ్నించారు. నోటిఫికేషన్ల వేయకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వం కాలయాపన చేసిందని ఫైర్ అయ్యారు.
ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పెదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరికైనా వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? అని అడిగారు. 25లక్షల కోట్లు ఎటు పోయాయి? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా? అని ప్రశ్నలు గుప్పించారు. తెలంగాణలో 10శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారన్నారు.
తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా? అని నిప్పులు చెరిగారు. రైతులు, నిరుద్యోగులకు,విద్యార్థులకు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలన్నారు. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుందన్నారు.