అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి తాను సవాల్ విసురుతున్నానని, కానీ ఆయన స్పందించడం లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి తన చెంచాలతో తనను తిట్టిస్తున్నాడన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుందన్నారు. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుందని పేర్కొన్నారు.
నిజామాబాద్కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అని ఆయన అడిగారు. నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ,మెడికల్ కాలేజ్, 30 పడకల ఆస్పత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందేనన్నారు.
ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ నని చెప్పారు. ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా నడవదా అని అడిగారు. అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగిందన్నారు. అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్నారు.
పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండని ఆరోపణలు గుప్పించారు. మోడీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు? అని మండిపడ్డారు. ధర్మపురి అరవింద్ పేరులో మాత్రమే ధర్మం ఉందన్నారు. ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందన్నారు.
నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని కోరారు. తల్లిని చంపి పిల్లను బతికించారని తెలంగాణను మోడీ అవమానించారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు.