శుక్రవారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజా గాయకుడు గద్దర్.. గాంధీ కుటుంబంపై రూపొందించిన రైతు సంఘర్షణ సభ దృశ్య కావ్యాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. వచ్చాక రైతులకు ఏం చేయబోతున్నామనే డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
వడ్లు కొనమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఫైరయ్యారు రేవంత్. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని స్పష్టం చేశారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. అధికారంలోకి వచ్చాక 2004 నాటి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పారు.
రైతులకు మళ్ళీ అన్ని రకాల సబ్సిడీలు అందిస్తామని తెలిపారు రేవంత్. వరంగల్ సభకు రాష్ట్రంలోని రైతులందరూ తరలి రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేయబోతున్న ఈ యుద్దానికి అండగా నిలబడాలని కోరారు. ప్రతీ బూత్ ఎన్ రోలర్ 9 మందిని సభకు తీసుకురావాలని అన్నారు.
కేసీఆర్ అవినీతికి అవధులు లేవని విమర్శించారు రేవంత్. యాదగిరి నరసింహ స్వామి ఆలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. రెండు వేల కోట్లతో నిర్మించిన దేవాలయంలో కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి దాగివుందని మండిపడ్డారు. యాదగిరి నరసింహ స్వామి కూడా కేసీఆర్ కుటుంబానికి బలైపోయారని అన్నారు. ఆఖరికి అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగిందన్న రేవంత్.. 62 కోట్లతో మొదలు పెట్టిన స్థూపం.. 2 వందల కోట్లు చెల్లించినా పుర్తి కాలేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం వారసుల సంపదను మించిపోయాయని విమర్శలు చేశారు.