టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 75 రోజులుగా వీఆర్ఏలు సమ్మే చేస్తున్నారని ఆయన తెలిపారు.
అయినప్పటికీ దున్నపోతుపై వాన పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. వీఆర్ఏలు వినతిపత్రం ఇస్తే వారి ముఖంపై విసిరికొట్టడం సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ తహశీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్న వీఆర్ఏలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వీఆర్ఏలు వినతి పత్రాలు ఇచ్చారు.
ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు సీఎం కేసీఆర్ పాల్పడుతున్నారని, దానికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున వీఆర్ఏల పోరాటానికి అండగా ఉంటామన్నారు. వీఆర్ఏల డిమాండ్ల సాధన కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.