– గతంలో ఆదివాసీ రైతులకు సంకెళ్లు
– ఇప్పుడు గౌరవల్లి రైతులకు బేడీలు
– రైతు రాజ్యం అంటే ఇదేనా?
– పది మందికి అన్నం పెట్టే రైతన్నకు సంకెళ్లా?
– ఇలాంటి సర్కారు తెలంగాణకు అవసరమా?
– కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
– రేవంత్ రెడ్డి వార్నింగ్
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో చేస్తున్న ఆరాచకాలు హద్దులు దాటుతున్నాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బేడీలు వేసి వేధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతుల పొలాల్లో నీళ్ల సంగతి దేవుడెరుగు.. వారి కళ్లలో మాత్రం నీళ్ల సుడులు తిరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారాలు చేసుకోవడం నాణేనికి ఒక వైపు మాత్రమే.. కానీ నాణేనికి రెండోవైపు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవల్లి ప్రాజెక్టులో రీడిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య ఒకటి నుంచి 8కి పెరిగిందన్నారు రేవంత్. మొదట్లో ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపునకు గురైందని… రీడిజైన్ ఫలితంగా అదనంగా మరో ఏడు గ్రామాలు.. తెనుగుపల్లి, మదెల్లపల్లి, సోమాజితండా, చింతల్ తండా, పొత్తపల్లి, జాలుబాయి తండా, తిరుమల్ తండా మునిగిపోతున్నాయని వివరించారు. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం ధర 20 నుంచి 30 లక్షల రూపాయాలకు తక్కువ లేదని కేసీఆరే చెప్పారన్నారు. మరి.. గౌరవల్లి నిర్వాసితుల భూములకు ఆ ధర ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ.2.10 లక్షలు, మరికొందరికి రూ.6.90 లక్షల పరిహారం అందించినట్లు అధికారులే చెబుతున్నారన్న ఆయన.. అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదని, సామాజిక సర్వేలో చాలామందికి అన్యాయం జరిగిందని తెలిపారు.
ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు పూర్తికావొస్తున్నా 186 మందికి అసలు పరిహారమే అందలేదన్నారు రేవంత్. నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి.. తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని వివరించారు.
‘‘ఎంతో విలువైన సాగుభూమి.. ఇన్ని తిండి గింజలు ఇచ్చి.. ఇంటిల్లిపాదికి అన్నం పెడుతూ గొప్ప భరోసాగా ఉన్న భూములను ప్రాజెక్టుల కోసం రైతులు పెద్ద మనసుతో త్యాగం చేశారు. ఇంత చేస్తే నిర్వాసితులకు ఏమి మిగిలింది. పరిహారం అడిగిన పాపానికి వారిపై లారీచార్జ్ చేయడమే కాకుండా అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. రైతుల భూములు లాక్కుని… పరిహారం ఇవ్వకపోగా అరెస్టులు చేయడం, బేడీలు వేయడం గజ దొంగల్లాగా వారిని ట్రీట్ చేయడం అత్యంత ఆటవిక చర్య. గతంలో నిర్వాసితుల తరఫున ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కలిస్తే ఏవో మాటలు చెప్పారు తప్ప సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఖమ్మంలో ఆదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇప్పుడు గౌరవల్లి రైతులకు బేడీలు వేసి వారి ఉసురు పోసుకుంటున్నారు. రైతు రాజ్యం అంటే ఇదేనా. రైతు పక్షపాతికి మీరు కొత్త అర్ధం చెప్పారు. పది మందికి అన్నం పెట్టే అన్నదాత చేతికి సంకెళ్లు వేయడం. యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని దృశ్యం. అన్నంపెట్టే చెయ్యికి హాత్ కడీలు వేసిన సర్కారు తెలంగాణకు అవసరమా? దీనికి కర్త, కర్మ అయిన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని హెచ్చరించారు.
నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు రేవంత్. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని అన్నారు. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని చెప్పారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ. డబుల్ బెడ్రూం ఇళ్లు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిర్వాసితుల పక్షాన వారికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.