– జోడో యాత్రను అడ్డుకునేందుకు కుట్ర
– మోడీ డైరెక్షన్ లోనే కేసీఆర్
– యూపీఏ పక్షాలతోనే కేసీఆర్ చర్చలు అందుకే!
– జోడో యాత్ర ఏ రాష్ట్రంలో ఉంటే..
– అక్కడి నేతలకు ఈడీ నోటీసులు వస్తున్నాయి!
– ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదు
– మోడీ, కేసీఆర్ పై రేవంత్ ఫైర్
యూపీఏను చీల్చడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ ను ఎందుకు కలుపుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికేనని ఆరోపించారు. మోడీని ఓడించాలనుకుంటే.. బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలన్నారు. మోడీ ఆదేశాలతోనే కేసీఆర్ చర్యలు ఉంటున్నాయని.. అందుకే ఆయనపై ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయ లేదని మండిపడ్డారు. ఈఎస్ఐ కుంభకోణంపై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ను బలహీన పరచేందుకే కేసీఆర్, మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రేవంత్. కల్వకుంట్ల కుటుంబంలో వాటాల పంచాయితీ తెంచడానికే బీఆర్ఎస్ తీసుకొస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహించారు. ఈడీ అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారని.. ముఖ్య నేతలను కేసులతో భయపెట్టి వారిని బీజేపీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారని ఫైరయ్యారు. రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే.. గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. హెరాల్డ్ కేసులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గతంలో కేసును మూసేశారని గుర్తు చేశారు.
సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారని.. కర్ణాటకలో యాత్రను అడ్డుకునేందుకు శివకుమార్ ను విచారణకు పిలిచారని ఆరోపించారు. ‘‘ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోంది. ఈడీ అంటే బీజేపీ తన ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుంది. గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు నోటీసులొచ్చాయి. కోటి రూపాయల చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులిచ్చారు. వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీకి చందాలు ఇచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా? ఆరేడేళ్లలో బీజేపీకి రూ.4,841 కోట్ల చందాలు వచ్చాయి. అధికారంలో ఉన్నారనే వారికి చందాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వలేదు’’ అని ఫైరయ్యారు రేవంత్.
కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై వివరాలతో సహా తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేశానని తెలిపారు. స్పష్టమైన నివేదిక ఇస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీనే ఉండదని.. తొడుక్కోవడానికి అంగీలు లేని కార్యకర్తలున్న ఆపార్టీకి 800 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. ఢీల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో ఆఫీసుకు స్థలం కేటాయించారని.. కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ కు ఢీల్లీలో స్థలం ఇచ్చారని ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. టీఆర్ఎస్ నేతలకు ఒక్క నోటీసు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. ఫిరాయింపుల కమిటీలో కీలక నేత కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు వస్తాయని ముందే చెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ లో చేరాలనుకున్న వారిని భయపెట్టి బీజేపీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనుక కుట్రను ప్రజలు గమనించాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ ఎందుకు విచారణ జరపడం లేదు? ఈడీ, ఇన్ కం టాక్స్, సీబీఐలు మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. తెలంగాణలో కాంగ్రెస్ మనుగడలో ఉంటే కష్టమనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోంది. ఒక పార్టీ ఎదగాలంటే.. ఇంతలా దిగజారాలా? గతంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ గెలిచినా పైసా మార్పు రాలేదు. మునుగోడు ప్రజలారా మీ ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తాం. 11 రాష్టాల్లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది’’ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఇక ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక గురించి మాట్లాడుతూ… ఎవరు పోటీ చేసినా.. వారందరినీ సమానంగానే గౌరవిస్తామని తెలిపారు. అనుకోని కార్యక్రమాలు ఉండటం వల్లే శశిథరూర్ ను కలవలేకపోయానని క్లారిటీ ఇచ్చారు.