ఈమధ్య ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ కామన్ అయిపోయింది. పురుగులు పట్టిన ఆహారం తిని చాలామంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం ఉండడం లేదని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని నిప్పులు చెరిగారు. కలుషితమైన ఆహారం తిని 36మంది స్టూడెంట్స్ ఆస్పత్రి పాలయ్యారని మండిపడ్డారు.
రేవంత్ చేసిన ట్వీట్
‘‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి? భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా? పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్’’
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో వానపాము రావడం కలకలం రేపింది. ఆ ఆహారం తిని 36మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వార్డెన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భోజనంలో బొద్దింకలు, జెర్రీలు, పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.