టీఆర్ఎస్ ది అధికారం కాపాడుకోవాలని తపన.. బీజేపీది అధికారం లాక్కోవాలని ఆశ తప్ప.. ప్రజలపై చిత్తశుద్ది లేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇందిరాభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, పలు అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్. రాష్ట్రంలో పంట కొనే దిక్కులేదని.. మిల్లర్లు, దళారులతో ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించారు. కేసీఆర్ చేతిలో రైతులు బలయ్యారని.. వారిని బతికించుకోవడానికి వరంగల్ డిక్లరేషన్ తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణను ప్రకటించారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈనెల 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు రేవంత్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకం కానున్నట్లు చెప్పారు. 21 నాడు ప్రతి ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రచ్చబండ నిర్వహించాలన్నారు. 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఈ సభలు జరగాలని చెప్పారు. జూన్ 21 వరకు వీటిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పీసీసీ అధ్యక్ష హోదాలో తాను వరంగల్ జిల్లాలోని జయశంకర్ సొంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానన్నారు రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూస్తామన్నారు. అందరి కృషి వల్ల రైతు సంఘర్షణ సభ విజయవంతం అయిందని… చింతన్ శిబిర్ లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నారని అందులో తీసుకున్న అన్ని అంశాలను ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ సోనియా గాంధీకి పంపనున్నట్లు తెలిపారు.
సభ్యత్వ నమోదు, రైతు సంఘర్షణ సభ సక్కెస్ తో హ్యాట్రిక్ లా.. రాహుల్ గాంధీ 100 కిలోమీటర్ల పాదయాత్ర తెలంగాణ నుంచే మొదలవ్వాలని కోరతామన్నారు రేవంత్. డిజిటల్ మెంబెర్ షిప్, వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ మోడల్ గా పేరొచ్చిందన్న ఆయన.. రాహుల్ పాదయాత్ర కూడా ఇక్కడే చేపట్టేలా తీర్మానం చేసినట్లు తెలిపారు. అందరి కష్టంతోనే ఇవన్నీ సాధించామని.. ఇంకో ఏడాది కష్టపడితే అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.