– అరవింద్ కుమార్ కేసీఆర్, కేటీఆర్ కు తాబేదారా?
– 10 శాతం నిధులు చెల్లించని ఐఆర్బీకి టెండర్ ఎలా ఇస్తారు?
– తక్షణమే టెండర్ ను రద్దు చేయాలి
– ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వకుంటే..
– హెచ్ఎండీఏ, హెచ్ జీసీఎల్ కార్యాలయాలు ముట్టడిస్తాం
– సమాచారం ఇచ్చే వరకు అధికారులను నిర్బంధిస్తాం
– ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ మౌనమెందుకు?
– బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?
– కేసీఆర్ కేబినెట్ దొంగల బండి
– మరోసారి బీఆర్ఎస్ సర్కార్ పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
– ఓఆర్ఆర్ టెండర్ అవకతవకలపై..
– ముందే చెప్పిన తొలివెలుగు
ఓఆర్ఆర్ ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని.. ఓఆర్ఆర్ ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు మరో దోపిడీకి తెర తీశారని అన్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను ఇవ్వాల్సి ఉందని తెలిపారు. చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని మండిపడ్డారు.
ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు రేవంత్. లక్ష కోట్ల ఆస్తిని రూ.7,388 కోట్లకే కొల్లగొట్టిన కంపెనీ.. రూ.738 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన్నారు. హెచ్ జీసీఎల్ ఎండీగా హడావుడిగా బీఎల్ఎన్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన ఈయన్ను తీసుకురావడం వెనుక మతలబు ఏంటని అడిగారు. ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన పదవిని రిటైర్ అధికారికి ఎందుకు అప్పజెప్పారని నిలదీశారు.
ఐఆర్బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49శాతం వాటా అమ్మేశారని.. తేజరాజు, రాజేష్ రాజు.. కేటీఆర్ సింగపూర్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే, గూడుపుఠానీ సమావేశాలు జరుపుతున్నారని మండిపడ్డారు. ఐఆర్బీ సంస్థకు టెండర్ ఇవ్వగానే సింగపూర్ కంపెనీ వచ్చిందని.. ఆ తరువాత షెల్ కంపెనీలు ముందుకొస్తాయని.. వాటి వెనుక ఉన్న రాజులు ఎవరో.. యువరాజులు ఎవరో తేలాలని అన్నారు. ఈ నెల 26 లోగా ఐఆర్బీ సంస్థ నిబంధనల ప్రకారం 10శాతం నిధులు చెల్లించాలని… లేకపొతే, సంస్థ టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.
ఓఆర్ఆర్ టెండర్ చుట్టూ జరుగుతున్న తతంగంపై అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలన్నారు రేవంత్. ఆయన తనకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘‘కేవలం కేసీఆర్, కేటీఆర్ కు మాత్రమే తాబేదారా? నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది. మజెల్స్ సంస్థ నివేదిక తప్పు అని తేలింది కదా.. 10 శాతం నిధులు చెల్లించలేని ఐఆర్బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి. సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే హెచ్ఎండీఏ, హెచ్ జీసీఎల్ కార్యాలయాలు ముట్టడిస్తాం. సమాచారం ఇచ్చే వరకు అధికారులను నిర్బంధిస్తాం’’ అని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్న ఆయన.. ఇంత దారి దోపిడీ జరుగుతున్నా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని మండిపడ్డారు. కేబినెట్ కూడా పరిమితికి లోబడి పని చేయాలన్న రేవంత్.. అదేమీ గంగా నది కాదు.. ఆమోదిస్తే పుష్కర స్నానం కాదు అని వ్యాఖ్యానించారు. కేబినెట్ లో ఉన్నది దేవుళ్లు కాదు.. ఉన్నదంతా దొంగలే.. కేసీఆర్ కేబినెట్ దొంగల బండి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
ముందే చెప్పిన తొలివెలుగు
ప్రభుత్వం నిర్మించే ఆస్తులకు తరుగుదల ఉండదు. అయితే.. వేల కోట్లు పెట్టి నిర్మించిన వాటిని ఆయా ప్రభుత్వాలు అప్పనంగా అమ్మేస్తుంటాయి. ఇలా ఎన్నో చూశాం. ఈక్రమంలోనే ఓఆర్ఆర్ టోల్ టెండర్ ఇష్యూపై తొలివెలుగు కథనం ఇచ్చింది. ‘టోల్ టెండర్ హీట్’ పేరుతో ఇచ్చిన ఈ కథనంలో అన్నీ పూసగుచ్చినట్టు వివరించాం. అందరి వేళ్లూ అరవింద్ వైపే అంటూ ప్రచురించాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. ఈ విషయంలో తగ్గేదే లేదని.. దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తామని చెబుతున్నారు.