– బీజేపీ నేతలు మాటలతోనే సరిపెడతారా?
– కేసీఆర్ అవినీతిపై చర్యలేవి?
– టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు
– గులాబీ కూలీ వ్యవహారాన్ని వదిలేదు
– మరోసారి ఢిల్లీలో పిటిషన్ వేస్తా..
– అసలు నిజాలు అందరికీ తెలిసేలా చేస్తా..
– టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మార్చడానికి వీల్లేదు
– బీజేపీ, టీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్
కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ అంటోంది.. లేదు లేదు టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ చెబుతోంది.. కాంగ్రెస్, బీజేపీపై అనుమానం వ్యక్తం చేస్తోంది టీఆర్ఎస్… ఇలా.. ఒకరికొకరు లింకులు పెడుతూ తెలంగాణ రాజకీయం సాగుతోంది. పైగా మాత్రం మూడు పార్టీల నేతలు మాత్రం బండబూతులు తిట్టుకుంటున్నారు. ఎవరితో ఎవరు కలిశారో ఏమోగానీ, మాటల యుద్ధం మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీ బంధంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
బీజేపీ, టీఆర్ఎస్ తమ మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నాయని అన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోందని.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని.. మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు కేసీఆర్ దోపీడీని ప్రస్తావిస్తున్నారు కానీ ఎలాంటి యాక్షన్ ఉండడం లేదని మండిపడ్డారు. ఢిల్లీ హైకోర్టులో తాను అన్ని వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని.. 2018లో ఎలక్షన్ కమిషన్ కు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారని.. రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు సేకరించారని చెప్పారు రేవంత్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరమని.. అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానమని అన్నారు. ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని.. కానీ, పట్టించుకోలేదని వివరించారు. పార్టీ చందాలు వసూలు చేశారని కేసును క్లోజ్ చేశారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోకూడదని.. గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదని చెప్పారు. ఎన్నికల సంఘం నియమావళిని కేసీఆర్ ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై తాను ఎన్నికల సంఘాన్ని కలిసి చర్యలు తీసుకోవాలని కోరానని వివరించారు. కానీ, విచారణకు సిబ్బంది లేరని ఈసీ చెప్పినట్లు తెలిపారు.
‘‘ఇక దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తే.. హోంమంత్రికి పంపించారు. నేను ఎంపీ అయిన తర్వాత సీబీడీటీకి ఫిర్యాదు చేశా. ఐదేళ్లుగా వందల కోట్లు వసూలు చేశారు. కేసీఆర్ ఒక ఆర్ధిక ఉగ్రవాది. ఆయనపై కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. సరైన చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ రద్దు అవుతుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తే టీఆర్ఎస్.. కుక్కలు చించిన విస్తరిలా అవుతుంది. అందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుంటున్నారు. వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తున్నారు. బీజేపీ సహకారంతో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితులను తెలంగాణలో సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష హోదాను బీజేపీకి ఇప్పించడానికే టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి’’ అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఇలాంటి దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో బీజేపీ చెప్పాలని నిలదీశారు. రెండు రాజకీయ పార్టీల రాక్షస క్రీడలో భాగంగానే కీటీఆర్ శుక్రవారం ఈడీ ప్రకటన చేశారని చెప్పారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రకటనల వెనుక టీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం ఉందన్నారు. కాంగ్రెస్ ను ఖతం చేయడానికే డ్రామాలు ఆడుతున్నాయని.. తన పిటిషన్ పై విచారణ జరిపే వరకు టీఆర్ఎస్ పేరు మార్చడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తానని స్పష్టం చేశారు.