భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టారు .. పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు. అనంతరం ఆయన కాన్వయ్ తో ములుగు చేరుకున్నారు… అక్కడ కార్యకర్తలు గజమాలతో రేవంత్ కి ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గుట్టమ్మ, సాయిబాబా దేవాలయాలను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద 400 మంది కార్యకర్తలతో రేవంత్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు . ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ హా త్ సే హాత్ అభియాన్ జోడయాత్ర కు తెలంగాణలో సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు .
అనంతరం ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు..అక్కడ నుంచి పాదయాత్రను ప్రారంభించారు.. పాదయాత్ర కొత్తూరు, నార్లాపూర్ మీదుగా ప్రాజెక్ట్నగర్కు చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తర్వాత యాత్ర తిరిగి పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 4.30కు పస్రా చేరుకుంటారు.
పస్రా రోడ్డు జంక్షన్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పస్రా నుంచి మరో 10 కి.మీ. పాదయాత్ర నిర్వహిస్తారు. అక్కడి నుంచి వాహనంలో రాత్రి బస చేసే పాలంపేట గ్రామానికి రేవంత్రెడ్డి చేరుకుంటారు.ఇది ఇలా ఉంటే తెలంగాణలో మరో కొద్ది నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో.. రేవంత్ పాదయాత్రపై కాంగ్రెస్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు.
రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని భావిస్తున్నారు. నేతల మధ్య విబేధాలు సమసిపోతాయని, కాంగ్రెస్ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రేవంత్ పాదయాత్రలో పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు కూడా పాదయాత్ర చేసేలా టీ కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది.