టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అసలు హానీ ట్రాపా లేదా హ్యాకింగా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు.
ఈ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చుట్టూనే తిరిగిందన్నారు. ఈ ప్రాంత ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలని యూనివర్సిటీల నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని పేర్కొన్నారు.
ఉద్యమాన్ని కేసీఆర్ తన రాజకీయ ఉపాధిగా మలచుకున్నారని ఆయన ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను నమ్మించారన్నారు. 1200 మంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. 1లక్షా 50వేల ఖాళీలను భర్తీ చేస్తామని మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తొమ్మిదేండ్లయినా ఆ హామీని కేసీఆర్ నేరవేర్చలేదన్నారు. రాష్ట్రం వచ్చాక 2వేల మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కేసీఆర్ పాల్పడిన హత్యలేనన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయో చైర్మన్ , సీఎం, వివరణ ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30లక్షల మంది నిరుద్యోగుల వివరాలు దాచిపెట్టాలని చూసిందన్నారు. టీఎస్పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఇప్పుడు లీకేజీలతో అభ్యర్థులను గందరగోళం లోకి నెట్టారని పేర్కొన్నారు. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల స్ట్రాంగ్ రూమ్ లోకి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చాక ఏ పోటీ పరీక్ష కూడా పారదర్శకంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలోనూ తప్పులు జరగడంతో 24 మంది విద్యార్థులు మరణించారని ధ్వజమెత్తారు. ఇది సీఎం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనమన్నారు.
టీఎస్ పీఎస్సీ వ్యవహార శైలి లోపభూయిష్ఠంగా కనిపిస్తోందన్నారు. టీఎస్ పీఎస్సీ ఉనికి ప్రశ్నర్ధకంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పెద్దలను కాపాడేందుకే దీనిపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.
ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సూమోటోగా స్వీకరించి విచారణ చేయొచ్చన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ తేల్చిందన్నారు. నియామకాలు చేపట్టాల్సిన టీఎస్పీఎస్సీలో 400 మంది ఉద్యోగులకు కేవలం 80 మంది ఉద్యోగులే ఉన్నారన్నారు. ఇది కేసీఆర్ నిర్లక్ష్యానికి ఒక స్పష్టమైన ఉదాహరణ అని విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రం లీకేజీపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.