యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని కాశీంపల్లి గ్రామం నుంచి భూపాలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. అయితే.. రేవంత్ మీటింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
సభా వేదిక వైపు దూసుకొచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకుని పక్కనే ఉన్న థియేటర్ లో పెట్టారు. ఈ సందర్భంగా పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ, సభ వైపు రాళ్లు రువ్వారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కోడిగుడ్లు, టమాటలను కూడా విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో సినిమా థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తతల నడుమ ప్రసంగం పూర్తి చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం దోపిడీ దొంగల చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ లూటీ అవుతోందని ఆరోపణలు చేశారు.
‘‘కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొర గడీలో గడ్డి తినేందుకు ఫిరాయించాడు. మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. పోలీసుల అండతో కొంతమంది మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నవా? నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేద్కర్ చౌరస్తాకు రా నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతాం’’ అంటూ సవాల్ చేశారు రేవంత్.