ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడేళ్లుగా అకారణంగా ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర నుండి తెలంగాణకు కేటాయించిన ముగ్గురు ఎక్సైజ్ సూపెరింటెండెంట్స్ కు ఎటువంటి కారణం లేకుండా, పోస్టింగ్, జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని గుర్తు చేశారు.
“ఏడేళ్ల తరువాత అన్ని శాఖలతోపాటు ఎక్సైజ్ శాఖలో 64 ఉన్నతాధికారులకు పదోన్నతి ఇచ్చి అందులో 12 మంది అధికారులకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతావారిని అదే స్థానాల్లో కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నలుగురు అసిస్టెంట్ కమిషనర్లను, ఒక డిప్యూటీ కమీషనర్ ను, ఒక జాయింట్ కమిషనర్ ను 6 నెలలకు పైగా వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు లేకుండా వేధిస్తున్నారు. ఉద్యోగుల పరువు పోయే విషయం ఏంటంటే జీత భత్యాలు చెల్లించాల్సిన ప్రభుత్వం ఈ అధికారులకు బతుకు వెళ్లదీయడానికి రెండు మూడు నెలలకు ఒకసారి కన్సాలిడేటెడ్ అప్పు ఏర్పాటు చేసింది. ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి జీతభత్యాలు ఇవ్వకుండా అప్పు తీసుకొని బతకమంటున్నారు. ఎక్సైజ్ శాఖకు బాధ్యుడిగా ఉన్న సోమేష్ కుమార్, సంబంధిత మినిస్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఇదే విషయమై ప్రముఖ పత్రికలు ఎన్నో కథనాలు ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక వారు, కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి రావాల్సిన పీఆర్సీ, ఇంక్రిమెంట్స్, ప్రీమియం చెల్లించక ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. జీపీఎఫ్ చెల్లింపులు, ఇతర పొదుపు ఖాతాలు ఆగిపోయాయి. ఎలాంటి తప్పు చేయకున్నా వారంతా సామాజికంగా అవమానం ఎదుర్కొంటున్నారు. ఎక్సైజ్ లాంటి నేరాలను అదుపు చేసే శాఖలలో 20శాతం అధికారులను వెయిటింగ్ లో పెట్టి… పని చేస్తున్న అధికారులకే నాలుగైదు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల నేరాలు అదుపు లేకుండా పోయే ప్రమాదం ఉంది” అంటూ సమస్యను లేఖలో వివరించారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి 3 అదనపు బాధ్యతలు.. రంగారెడ్డి డీసీకి 4, మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ కు 3 అదనపు బాధ్యతలు అప్పగించారన్నారు రేవంత్. ఇంచుమించు శాఖలో ప్రతి ఒక్కరికి అదనపు బాధ్యతలు ఉన్నాయని.. అయినా కూడా పోస్టింగ్ ఇచ్చి పని చేయించుకోవడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యూలర్లు ఉద్యోగిని వెయిటింగ్ లో పెట్టరాదని, రిపోర్ట్ చేసిన 10 రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని, వెయిటింగులో పెట్టినట్లు అయితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా సంబంధిత అధికారి జీతం నుండి వెయిటింగ్ అధికారుల జీత భత్యాలు రికవరీ చెయ్యాలని ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. వాటికి సంబంధించిన వివరాలను కూడా లేఖలో పేర్కొన్నారు రేవంత్.
I.Circular memo No. 5630-A/210/FR.I/2005 of Finance (FR.I) Dept Dated 16-3-2005
II.GOMs. No.48 Finance & Planning (FW.FR.I) Department Dated 24-3-1981.
III. Circular memo. 2/111/A2/ FR.I/2000 Finance (FR.I) Dept Dated 28-10-2002
IV. Cir memo N0.11854-A/233/A2/FR.I/98 Finance &PlanningFW(FR.I) Dept Dated 28-3-1998.
V.Cir. Memo No. 43877/682/A2/FR.I/96 of Finance &planning (FW.FR.I) dated 1-1-97.
ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి అతి దారుణంగా ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు రేవంత్. పరిపాలన అవసరాల దృష్ట్యా అతి తక్కువ కాలం, సందర్భోచితంగా వాడాల్సిన వెయిటింగ్ ని ఇష్టం వచ్చినట్లు వాడి ఉద్యోగులను ఏళ్ల తరబడి వెయిటింగ్ లో పెట్టి వారిని, కుటుంబ సభ్యులను మానసిక, ఆర్థికంగా వేధింపులకు గురిచేయడం దారుణమని లేఖలో రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి.