రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితిని వివరిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో.. రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యల కారణంగా రైతులు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందన్నారు రేవంత్. వెంటనే రైతు వేదికలను పునరుద్ధరించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు.
ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్యం వేదికలు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చినట్లు లేఖలో వివరించారు రేవంత్. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యకం చేశారు. ప్రతి రైతుకు 6 నుంచి 12 లక్షల వరకు అప్పు ఉందని వివరించారు.
లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు రేవంత్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పుల విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలోని పిల్లలను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి.. ప్రభుత్వం ఉచితంగా చదివించాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలని.. కల్తీ, నకిలీ పురుగు మందులు నివారణకు తగిన పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని చెప్పారు.