– తెలంగాణ మోడల్ అంటే..
– తాగుబోతుల తెలంగాణనా?
– కేసీఆర్ వచ్చాక వైన్స్, బెల్ట్ షాపులే పెరిగాయి
– బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే!
– గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్ గఢ్ మోడల్ కావాలో తేల్చుకోండి
– కరీంనగర్ కవాతులో రేవంత్ రెడ్డి
కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎంగా కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో 3వేల వైన్ షాపులు, 60వేల బెల్టు షాపులు వచ్చాయని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ అంటే ఇదేనా? అంటూ ఫైరయ్యారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ కవాతు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. దీనికి ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర స్థలం ఉంటుందని.. కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియం అలాంటిదేనన్నారు.
60ఏళ్ల ఆకాంక్షను గౌరవించి 2004లో ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. మాట తప్పక మడమ తిప్పక సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. కానీ, ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవరిపాలైందో మీరు ఆలోచన చేయండని ప్రజలను కోరారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులను, నిరుద్యోగులను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నానన్నారు.
ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, తన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారని అడిగారు. పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోడీ అవహేళన చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టంలేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని ఫైరయ్యారు రేవంత్. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని హెచ్చరించారు. గుజరాత్ మోడల్ కావాలో ఛత్తీస్ గఢ్ మోడల్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండని సూచించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.