ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసింది కాంతార చిత్రం. ఈ సినిమాతో హీరో రిషబ్ శెట్టి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన ఇంటర్వ్యూల కోసం నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది. కాంతార చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రిషబ్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇక ఇదే సమయంలో రిషబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త కన్నడ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు రిషబ్. తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని..కానీ తన సినిమాలకు ప్రేక్షకుల మద్దతు ఇవ్వాలని కోరారు. రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ ట్వీట్ పై స్పందించారు హీరో.
తాను రాజకీయాల్లోకి రావడమనేది నిజం కాదని.. ఇది తప్పుడు వార్త అని అన్నారు. కొంతమంది నన్ను తమ పార్టీకి మద్దతుదారుడిగా ఉండమన్నారు. కానీ నేను రాజకీయాల్లోకి మాత్రం రాను అని రిప్లై ఇచ్చారు రిషబ్. ఇక ఈ హీరో ట్వీట్ కు ఓ అభిమాని స్పందిస్తూ.. మీరు రాజకీయాల్లోకి రండి నేను మద్దతు ఇస్తాను అంటూ కామెంట్ చేశాడు.
ఇందుకు రిషబ్ స్పందిస్తూ.. “నాకు పొలిటికల్ సపోర్ట్ వద్దు.. కానీ నా సినిమాలకు మద్దతు ఇవ్వండి. మూవీస్ చూసేందుకు థియేటర్లకు రండి ” అంటూ కామెంట్ చేశాడు. ఇక రిషబ్ పొలిటికల్ ఎంట్రీ న్యూస్ ఇది మొదటి సారి కాదు.. గతంలోనూ అనేకసార్లు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కాంతార చిత్రం విడుదలైన తర్వాత ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారని పుకార్లు వ్యాపించాయి. కాంతార చిత్రంలో చూపించిన దేవుడి అరుపులను అవహేళన చేయవద్దని ప్రేక్షకులను విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.