‘ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు బెటర్గా’ అంటూ స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ తన హెల్త్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నాడు. కారు యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి బుడిబుడి అడుగులు వేస్తున్నరిషభ్ పంత్ రికవరీని పిక్స్ ని ఫ్యాన్స్ కు చేరవేసాడు.
తాను కోలుకుంటున్నాననే భరోసా ఇస్తూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశాడు రిషబ్. ఫొటోలో పంత్.. చేతి కర్ర సాయంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా కనిపించింది.కుడి కాలికి బ్యాండేజీ కనిపించడం.. కాలు కూడా కొంచెం వాచినట్లుగా ఉంది. దీంతో పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఆ ఫొటోలకు.. ‘ఒక అడుగు ముందుకు’ అంటూ పైవిధంగా క్యాప్షన్ జోడించాడు పంత్. దీంతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీని కూడా పోస్ట్ చేశాడు. అందులో లూడో ఆడుతున్న ఫొటోను జత చేసి ‘నేను ఇంత కన్నా ఏం చేయగలనో..ఏమైనా సూచనలు ఇవ్వగలరా’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, పంత్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్లతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దిల్లీ నుంచి లఖ్నవూకు వెళ్తున్న సమయంలో రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్కు తీవ్ర గాయాలయ్యాయి.పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన తర్వాత.. పంత్ కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ఇక పంత్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రమాదం కారణంగా.. ఈ ఏడాది జరిగే కీలక సిరీస్లు, టోర్నమెంట్లు సహా ఐపీఎల్ కూడా పంత్ మిస్ అవుతాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కోలుకున్నా.. ఫిట్నెస్ నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించడం కష్టమే..