పెట్రోల్ ధరల పెంపు, గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలకు పెనుభారంలా మారాయన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా కేంద్రంపై మంత్రి మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో మళ్లీ ధరలు మండిపోతున్నాయని అన్నారు.
కరోనా ప్రభావంతో ఆదాయం లేక అల్లాడుతున్న ప్రజలను అధిక ధరలు అప్పులపాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలంగాణ ప్రజలు.. పెరుగుతున్న ధరలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక బీజేపీ నిజస్వరూపం వెల్లడైందని హరీశ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అధికంగా ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని పేర్కొన్నారు.
కాగా.. శనివారం హరీశ్ రావు సతీసమేతంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఇక్కడి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సుప్రసిద్ధ శైవక్షేత్రంలో మొక్కులు తీర్చుకున్నారు మంత్రి.