ఎస్సీల వర్గీకరణలో నెంబర్ వన్ దోషి బీజేపీనేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన ప్రజా భరోసా యాత్ర ఎస్సీలకు ఏ మాత్రం భరోసా ఇవ్వలేదని, ఇక తెలంగాణ ప్రజలకు ఏం భరోసా ఇస్తారంటూ దుయ్యబట్టారు.
ఎమ్మార్పీఎస్ వర్గీకరణలో బీజేపీ చేసిన మోసానికి నిరసనగా మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారులను దిగ్భందం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసింది కూడా బీజేపీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్చి 15న ఎస్సీల వర్గీకరణ కోసం హైదరాబాద్, విజయవాడ రెండు రహదారులపై నిరసనలు చేపడతామని చెప్పారు. ఈ నెల 22 నుండి మార్చి14 వరకు అన్ని మండలాల నుండి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే అనాథ పిల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రుల నియోజకవర్గాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ లో రూ.3 లక్షల కోట్లు కేటాయించారని చెప్తున్నారు గానీ.. రూ.3 కూడా ఖర్చుబెట్టలేదని ఆరోపించారు మందకృష్ణ మాదిగ.