దొంగలకి ఒక ఊరు అని ఏముంది..? రంగంపేట అయినా ఒకటే.. రాజధాని అయినా ఒకటే.. ఎక్కడైనా సరే అవకాశం దొరికితే పేట్రేగిపోతున్నారు. సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇంట్లో నిన్న దొంగలు పడ్డారు. దొరికింది దొరికినట్టు దోచేశారు. మా ఇంట్లో దొంగలు పడ్డారంటూ మంత్రి గారు ట్వీట్ చేసి ప్రపంచానికి చెప్పుకోవడం ఇక్కడ హైలైట్..
ఢిల్లీ: న్యూఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో మంత్రి సత్యేందర్ జైన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు దొరికిన వస్తువులన్నీ దోచుకెళ్లారు. మంత్రి భార్య పూనం జైన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ‘సరస్వతి విహార్లోని నా ఇంట్లో దొంగలు పడ్డారు. భవనం అన్ని అంతస్తుల్లో దొంగలు గాలించి వస్తువులను చోరీ చేశారు. దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు ఢిల్లీ పోలీసులంటే భయం లేదు’ అని మంత్రి సత్యేందర్ జైన్ చోరీ ఘటనపై ట్వీట్ చేశారు. మంత్రి ఇల్లు ఆరు నెలలుగా తాళం వేసి ఉండటంతో చోరీ జరిగిందని స్థానికులు చెప్పారు. మంత్రి ఇంట్లోని బెడ్ రూం, కిచెన్లలో పలు వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని ఢిల్లీ డీసీపీ కోన్ చెప్పారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నామని డీసీపీ వివరించారు.
Theft in my house at Saraswati Vihar. All floors searched thoroughly for hours. Anti social element and thieves have no fear of @DelhiPolice . pic.twitter.com/1JBkaa25NL
— Satyendar Jain (@SatyendarJain) September 22, 2019