– కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపుపై రౌండ్ టేబుల్ సమావేశం
– కాంట్రాక్టర్, ప్రభుత్వంపై మండిపడ్డ అఖిలపక్ష నేతలు
– సిట్టింగ్ జడ్జితో విచారణ.. క్రిమినల్ చర్యలకు డిమాండ్
– సమావేశంలో పలు కీలక తీర్మానాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిల పక్షాలు, ఉద్యమ సంస్థలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. నాసిరకం నిర్మాణానికి భాద్యుడైన మేఘా కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నాయి. ప్రాజెక్టు భవితవ్యంపై ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులతో లోతైన సమీక్ష చేపట్టాలని నిర్ణయించాయి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అధ్యక్షతన ఇంజనీర్స్ ఫోరమ్, సోషల్ మీడియా ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజోపయోగమా? లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగమా? వాస్తవాలు- వక్రీకరణలు అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి అఖిల పక్ష నేతలు, ఇంజనీర్లు, సీనియర్ జర్నలిస్ట్ లు, ఉద్యమకారులు హాజరయ్యారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్ అధ్యక్షుడు దొంతుల లక్ష్మినారాయణ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. తెలంగాణ అన్యాయానికి గురవుతోందని ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకుంటే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ 8 ఏళ్లలో సాధించింది ప్రశ్నించే గొంతులను నొక్కేయడమేనని మండిపడ్డారు. కేసీఆర్ తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు. కేసీఆర్ పథకాలు అడుక్కు తినేలా ఉన్నాయని.. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే కల్వకుంట్ల కుంటుంబం చేసిన అవినీతి భాగోతం బయటకొస్తుందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెలేలు, మంత్రులు అవినీతి చేసి భవనాలు కట్టించుకుంటున్నారని… కానీ పేద ప్రజలకు ఇంతవరకూ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ చేసే అవినీతితో మొత్తం తెలంగాణకే నష్టం జరుగుతుందన్నారు. ఈ అవినీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు మధుయాష్కీ.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కేసీఆర్ సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు. అధికారం ఆస్తులను పెంచుకుంటే కాళేశ్వరం అవుతుందని అన్నారు. చాలా గ్రామాలు ముంపునకు గురవడం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్మాణమే కారణమని దుయ్యబట్టరు. తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఆస్తులు పెంచుకోవడం కోసమే పని చేస్తున్నారని ఫైరయ్యారు.
ఎవరు అవినీతి చేసినా బీజేపీ ప్రభుత్వం వదిలి పెట్టదని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు అన్నారు. కాళేశ్వరంలో అవినీతి అక్రమాలపై కేంద్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ముంపుపైన ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షించాలని కోరారు. బీఎస్పీ నేత దయానందరావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నాణ్యత లేని నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవినీతికి కారణమైన సీఎం కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదని.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ తో పాటు ఇంజనీర్స్, కాంట్రాక్టర్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పార్టీలన్నీ మౌనం పాటిస్తున్నాయని… కేసీఆర్ ప్రాజెక్టులన్నీ ప్రజలను మోసం చేశావేనని విమర్శించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలు
1. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో, రీ డిజైన్ లో జరిగిన తప్పిదాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు కూలటం, నీళ్లు పంపులను మొత్తం ముంచేశాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత. నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో బాధ్యులైన వారిపైన చట్టపరంగా చర్యలు చేపట్టాలి.
2. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలపై, అవినీతిపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
3. గోదావరి, కృష్ణా నదులను వాటిపై నిర్మాణాలను తన చేతిలోకి తీసుకుంటూ చట్టవ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను వెంటనే ఉపసంహరించాలి.
4. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంశించారు. మరోవైపు పార్లమెంట్ లో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమన్నారు. ఈ ద్వంద్వ వైఖరి మంచిది కాదు. ఇది తెలంగాణకు అన్యాయం కాదా?
5. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి. ఆదివాసీల ముంపు నివారించాలి. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలోకి మార్చాలి.
6. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిపుణులు, మొత్తంగా తెలంగాణ పౌర సమాజం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలను, అవినీతిని ప్రత్యేకంగా పరిశీలించాలి. నిజాలను సమాజానికి వివరించాలి.
ఈ సందర్బంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ.. ఎవరు తెలంగాణ పట్ల ప్రేమతో ఉన్నారో అలాంటి వారు, నిపుణులైన ఇంజనీర్స్ తో ఒక నిజానిర్దారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద తప్పు జరిగిందని, దాన్ని ఇప్పుడు ఎలా సరిదిద్దాలో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం బేషజాలకు వెళ్లకుండా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని… ఇప్పుడైనా తప్పును మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏపూరు సోమన్న, ఉద్యమ నాయకులు డాక్టర్ పృథ్విరాజ్, కత్తి వెంకటస్వామి, జయసారధి రెడ్డి, భగవాన్ రెడ్డి, తెలంగాణ విఠల్, ఇంజనీర్ విఠల్ రావు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ నాయకులు మేకల కృష్ణ, పాలకూరి రాజు, పోగుల ప్రకాష్, నాగార్జున్ రెడ్డి, స్వామి ముద్దం తదితరులు పాల్గొన్నారు.