ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీని.. సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అందుకు సంబంధించి మల్లన్నకు మంత్రి లాయర్ నోటీసులు పంపించారు.
తన వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని తన పైన మల్లన్న ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తన ఛానల్, పత్రికలో మల్లన్న అబద్ధాలు చెప్తున్నారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు.
బీజేపీ పార్టీకి చెందిన మల్లన్న దుర్బుద్ధితో.. జర్నలిస్ట్ గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని వివరించారు. మంత్రి పువ్వాడ పరువుకు భంగం కలిగించేలా అసత్యపూరిత ప్రచారం చేసిన మల్లన్న.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి 10 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు న్యాయవాది.
Advertisements
వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. 7 రోజుల్లో తన క్లైంట్ అయిన మంత్రి పువ్వాడ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు. లేదంటే కఠిన శిక్షకు అర్హులవుతారని స్పష్టం చేశారు న్యాయవాది.