ఢిల్లీ విమానాశ్రయంలో అత్యంత ఖరీదైన చేతి గడియారాలు, డైమండ్ పొదిగిన బంగారు బ్రాస్లెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుడిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న వాచీల్లో ఒకటి బంగారంతో వజ్రాలు పొదిగినదని, దాని విలువ రూ.27.09 కోట్లు అని అధికారులు తెలిపారు.
వీటి విలువ ప్రకారం చూస్తే ఇదే అతి పెద్ద వాణిజ్య, విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం అని ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని కస్టమ్స్ కమీషనర్ జుబైర్ రియాజ్ కమిలి తెలిపారు.
ఈ వాచీల విలువ దాదాపు 60 కిలోల బంగారంతో సమానమని ఆయన చెప్పారు. దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీ చేసినపుడు ఈ వాచీలు బయటపడ్డాయని ఆయన తెలిపారు.
నిందితుడు భారత పౌరుడే అని అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఏడు చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గడియారాల్లో జాకబ్ & కో (మోడల్: BL115.30A),పియాజెట్ లైమ్లైట్ స్టెల్లా (SI.No.1250352 P11179), రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ డేట్ జస్ట్ బ్రాండ్లకు చెందిన ఈ వాచీలు అత్యంత ఖరీదైనవని, వాటిలో జాకబ్ అండ్ కంపెనీ(మోడల్ బిఎల్115.30ఎ) విలువ రూ. 27.09 కోట్లని తెలిపారు.
ఏడు రిస్ట్ వాచీలతోపాటు వజ్రాలు పొదిగిన బంగారం బ్రేస్లెట్, ఒక ఐఫోన్ పిఆర్ఓ 256 జిబి కూడా ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నామని, వీటి మొత్తం విలువ రూ.28.17 కోట్లని ఆయన చెప్పారు. వాచీలను స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అరెస్టు చేశారు. నిందితుడు ట్రావెలర్, అతని మామకు దుబాయ్లో ఖరీదైన గడియారాల షోరూమ్ ఉందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని ఇతర ప్రదేశాలలో దీనికి శాఖలు ఉన్నాయని కస్టమ్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి తెలిపారు. గుజరాత్కు చెందిన ఓ క్లయింట్ వీటిని అందచేయాల్సి ఉందని నిందితుడు చెప్పాడని ఆయన తెలిపారు. నిందితుడు ఇప్పటి వరకు కస్టమర్ పేరు వెల్లడించలేదని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పాడని తెలిపారు.