విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్ అన్నారు. గత మూడేళ్లలో రూ. 28,907 కోట్ల మేర నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నష్టాలు తగ్గించేందకు చర్యలు చేపట్టామని చెప్పారు.
లోక్ సభలో మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విమానయాన పరిశ్రమకు 2021-22లో రూ. 11658 కోట్ల నష్టం వచ్చిందన్నారు. 2020-21లో రూ.12,479 కోట్లు, 2019-20లో రూ.4,770 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
ఈ నష్టాల నుంచి బయటపడేందుకు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై వ్యాట్ తగ్గించామని చెప్పారు. దీంతో పాటు ఎయిర్ పోర్ట్ నిర్వహణ సంబంధిత అంశాలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించామని వివరించారు.
విమానయాన సంస్థలకు సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని ప్రభుత్వం ఆమోదించినట్టు ఆయన వెల్లడించారు. రాబోయే ఐదేండ్లలో నూతన టెర్మినల్స్ నిర్మాణం, విస్తరణకు సంబంధించి రాబోయే ఐదేండ్లలో రూ. 98 వేల కోట్లు ఖర్చు చేయాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.