సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్లకు పంగనామం పెట్టారు కేటుగాళ్లు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, బంధువులనే ఆ మోసగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఏంటని ఎదురు తిరిగితే మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి తిరిగి దాడికి దిగుతున్నారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ లు ఈ మోసాలకు పాల్పడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్ పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. RRR, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది పలు సినిమాలలో పెట్టుబడులు పెడతామని, వాటి ద్వారా అధిక లాభాలు ఇస్తామని ఆ కేటుగాళ్లు బాధితులను నమ్మించారు.
దాదాపు 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్, వారి బంధువుల నుంచి ఏకంగా రూ.6 కోట్లు దోచేశారు. డబ్బులు తిరిగి అడగడంతో బెదిరింపులకు పాల్పడి.. తిరిగి బాధితులపైనే దాడికి పాల్పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పి వారి అనుచరులతో బెదిరించారు.
మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు బాధితులు. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు.