చైనా, తైవాన్ పౌరులు మరికొంత మందితో కలిసి ఏకంగా రూ.903 కోట్లకు పైగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. అత్యధిక లాభాలను ఆశగా చూపించి లక్షలాది మందిని మోసం చేసిన స్కామ్ లో తైవాన్ పౌరుడు, చైనా పౌరుడితో కలిపి మొత్తం పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్టుబడుల పేరుతో దాదాపు రూ.903 కోట్ల మోసం జరిగినట్లు హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్రాడ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు చైనా పౌరులు సహా 10 మందిని అరెస్టు చేశారు. రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసానికి గురైన ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ హవాలా మోసం వెలుగులోకి వచ్చింది.
లోక్సమ్ అనే ఇన్వెస్ట్మెంట్ యాప్లో రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసానికి గురైన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో విచారణలో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫిర్యాదుదారుడి డబ్బు జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు తేలింది.
హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. ఇది భారీ మొత్తంలో జరిగిన ఫ్రాడ్ గా పేర్కొన్నారు. విదేశీ మారకపు లావాదేవీలకు లైసెన్స్ పొందిన నగదు మార్పిడిదారులు ఈ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. విదేశాలకు వెళ్లే వారికి విదేశీ మారకద్రవ్యం ఇచ్చేలా లైసెన్స్ ఇచ్చారు. కానీ వారు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించారు. అక్రమంగా హవాలా లావాదేవీలు నడిపారని తెలిపారు.
ఢిల్లీ, ముంబై నుంచి హవాలా రాకెట్లు నడుపుతున్న చైనా జాతీయుడు లెక్ అలియాస్ లీ జాంగ్జున్, తైవాన్కు చెందిన చు చున్-యులను అరెస్టు చేశారు. అరెస్టయిన ఇతర నిందితుల్లో సాహిల్ బజాజ్, సన్నీ అలియాస్ పంకజ్, వీరేంద్ర సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్ కౌశిక్, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీమ్ బేగ్ లు ఉన్నారు.