దళితులను దగా చేయడానికే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకే తాను ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు ఆర్ఎస్పీ.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ ఓటమి ఖాయమని అన్నారు. రాష్ట్రంలో అధికారం కొంతమంది భూస్వాములు, పెట్టుబడి దారుల చేతుల్లోనే ఉందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తుందని దుయ్యబట్టారు.
ఏడేళ్లలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు ఆర్ఎస్పీ. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
కేసీఆర్ వల్లే చాలా మంది రైతులు యాసంగిలో వరి సాగుచేయలేదని.. వాళ్లందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తక్కువ ధరకు అమ్ముకున్న వారిని ఆదుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ గెలిచి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్.