సీఎం కేసీఆర్పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కు పంజాబ్ రైతులను పరామర్శించే సమయం వుంటుందని కానీ కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పలకరించే సమయం ఉండదా? అని ఆయన మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అందుకే మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నప్పటికీ ఆమెను అరెస్టు చేయడం లేదని పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కొడిమ్యాల మండలం నాచుపల్లి, తిరుమలాపూర్, కోనాపూర్, సూరంపేట గ్రామాల్లో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చే మాటేమో గానీ ఆ పార్టీ సచ్చేదిన్ మాత్రం వస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలని, రూ. 5వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలు పప్పన్నానికి నోచుకోని పరిస్థితిలో ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం 17 రకాల వంటకాలతో పక్క రాష్ట్ర నాయకులకు విందు ఏర్పాటు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు పేదల భూములు కొల్లగొడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.