ముమ్మాటికి తమది కుటుంబ పాలనేనని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబ సభ్యులేనని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
మొత్తం తెలంగాణ మీ కుటుంబమా? బాగానే చెప్పారంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. మరి అదే నిజమైతే మరి ఆస్తులు, ఫాం హౌసులు,సౌత్ గ్రూప్ వంటి బినామీలు, 100ల కోట్లు, కాంట్రాక్టులు, హెలీకాప్టర్లు, మెడికల్ కాలేజీలు,ఫారిన్ టూర్లు అన్నీ కేవలం మీ కుటుంబీకులకే ఉన్నాయని కౌంటర్ వేశారు.
మిగతా తెలంగాణ కుటుంబీకులకు ఎందుకు లేవు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలకు కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు.
ఇక ప్రచారంలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం తెలంగాణ మా కుటుంబమే అన్న కేటీఆర్ వ్యాఖ్యలను బాగా ఎండకడుతున్నారు. వంద కోట్లు పెట్టి విమానం కొనుక్కున్న కేసీఆర్ ఫ్యామిలీ..ఇలా మాట్లాడడం ఏమాత్రం సమంజమని.. కనీసం రెండు చక్రాల బండి కూడా లేని అభాగ్యులు, రెండు పుటలా అన్నం లేని వాళ్లు ఎందరో ఉన్నారని.. వాళ్లందరు కేసీఆర్, కేటీఆర్ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇక బీజేపీని కూడా గట్టిగా విమర్శించిన ఆయన అదానీ రోజుకు రెండు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారో మోడీకే బాగా తెలుసని ఎద్దేవా చేశారు.
మరో వైపు కేటీఆర్ తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్దని చెప్పారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని అన్నారు.