ఈ నెలలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా భారీగా తరలివస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులు కావలసిన ఏర్పాట్లను చేపట్టారు. జాతరకు వచ్చే ప్రజలకు కావలసిన రవాణాసౌకర్యాలకు సంబంధించిన సమస్యలపై తగు జాగ్రత్తలను తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
మేడారం జాతరకు భక్తులు వచ్చేందుకు 3,845 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ బస్సులు నడుస్తాయని అన్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తో కలిసి సోమవారం బస్ భవన్ లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
కరోనా నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్ డ్రైవ్ ద్వారా బూస్టర్ డోసులను ఇప్పించాలని, హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను అందించాలన్నారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని సూచించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ జాతర బస్సుల రాకపోకల పర్యవేక్షణకు 12 వేల మంది సిబ్బంది, 150 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు.
50 సీసీ కెమెరాలతో బస్సుల రాకపోకల వివరాలను తెలిపేందుకు ఆయా బస్టాండ్ లలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూంలలో ఫిర్యాదు చేయవచ్చని సజ్జనార్ తెలిపారు.