తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఛార్జీల పెంపు ప్రతిపాదన సీఎంకు పంపించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.. ఎండీ సజ్జనార్.. ఈడీలతో మంత్రి సమీక్ష జరిపారు. ప్రధానంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై చర్చించారు. ఈ ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్కు నివేదించామని బాజిరెడ్డి తెలిపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్కు 20 పైసలు.. ఇతర సర్వీసుల్లో కిలోమీటర్కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామన్నారు.
ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తోందని మంత్రి పువ్వాడ తెలిపారు. డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారిందన్నారు. కేంద్ర విధానాల వల్లే ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి.
పెరిగిన బస్సు ఛార్జీల ప్రకారం కిలోమీటరుకు కనీస ఛార్జీ 10 నుంచి గరిష్ఠంగా 35 రూపాయల వరకు పెరగనుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు కిలోమీటర్కు 10 రూపాయల చొప్పున.. మెట్రో డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులకు 15 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు.
డీలక్స్ బస్సులకు 20 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సులకు 25, రాజధాని ఏసీ బస్సులకు 35, గరుడప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్కు 35 రూపాయలు పెరిగింది. ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.
గడిచిన మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా లాక్డౌన్ తో, పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.