ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్దం నేపథ్యంలో ఇప్పటికే రష్యాకు చెందిన పలు కంపెనీలపై ఆయన ఆంక్షలు విధించారు. తాజాగా రష్యా, బెలారస్లకు చెందిన 182 కంపెనీలు, మరో ముగ్గురిపై ఆయన ఆంక్షలు విధించారు.
ఉక్రెయిన్లోని రష్యా, బెలారస్ కంపెనీల ఆస్తులను బ్లాక్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాటిని తమ రక్షణ కోసం వినియోగించుకోనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ ఓ జాబితా ను ప్రచురించింది. దాని ప్రకారం….
రసాయన ఉత్పత్తిలో ఉన్న సంస్థలు, వస్తువుల రవాణా, వాహనాల లీజింగ్ లపై ఆంక్షలు విధించారు. ఈ జాబితాలో బెలారస్ ప్రభుత్వ యాజమాన్యంలోని పొటాష్ ఉత్పత్తిదారు బెలారస్కాలి, రష్యాకు చెందిన పొటాష్ ఎరువుల ఉత్పత్తిదారు, ఎగుమతిదారు ‘ఉరల్కాలి’, బెలారసియన్ రైల్వేలు, రష్యాకు చెందిన వీటీబీ-లీజింగ్, గాజ్ప్రోమ్ బ్యాంక్ లీజింగ్ వంటి సంస్థలు ఉన్నాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్దం మొదలైంది. అప్పటి నుంచి ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబులతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ యుద్ధంలో రష్యన్ సైనికులు, ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు వేలల్లో చనిపోయారు.