కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి నాడు ‘మకర జ్యోతి’ దర్శనమిస్తుంది. దీనినే ‘మకర విలక్కు’ అని కూడా అంటూంటారు. ఈ మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వామి భక్తులు వేయి కళ్లతో వేచి చూస్తూంటారు. శబరిమలలో అయ్యప్ప కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై మకరజ్యోతి దర్శనమిస్తుంది.
ఈ ఏడాది కూడా అయ్యప్పభక్తులు మకరజ్యోతి దర్శనానికి భారీగా తరలివచ్చారు. శబరి గిరుల్లో అయ్యప్ప నామ స్మరణతో మార్మోగింది. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు తనివితీరా వీక్షించారు. ఈ సంవత్సరం మకర జ్యోతి దర్శనం శనివారం సాయంత్రం 6.45 గంటలకు దర్శనమిచ్చింది. ఈ
సమయంలో అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. శబరిమలలో రాత్రి 8.45 గంటల సమయంలో శబరి మల ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకర జ్యోతి దర్శనాన్ని అయ్యప్ప భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో దాదాపు మూడు సార్లు పవిత్ర మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో శబరి గిరులు స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో దద్ధరిల్లుతాయి.