విద్యాశాఖ ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల వివరాలను వెల్లడించారు. రెండు సంవత్సరాల రిజల్ట్ ను ఒకేసారి విడుదల చేశారు మంత్రి. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
ఫస్టియర్ లో 63.32 శాతం, సెకండియర్ లో 67.16 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 72.35 శాతంగా ఉండగా.. రెండో సంవత్సరంలో 75.28 శాతంగా నమోదైంది. అలాగే.. మొదటి సంవత్సరంలో బాలురు 54.20 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 60శాతం బాలురు పాసయ్యారు.
ఈసారి ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. హన్మకొండ రెండో స్థానాన్ని సాధించింది. ఆగస్ట్ ఒకటి నుంచి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా వల్ల రెండేళ్లు అందరం ఇబ్బందిపడ్డామని.. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్ లైన్ లో విద్యా బోధన చేశామన్నారు. ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించామన్న ఆమె.. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించామని తెలిపారు.
విద్యార్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in వెబ్సైట్ లో చూడొచ్చని అధికారులు తెలియజేశారు.