2003 వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు తనకు నిద్ర కరవైందని మాస్టర్ బ్యాట్స్ మేన్ సచిన్ తెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు. నిజానికి ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఎంతటి ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతుంటారు.
అదే సమయంలో మ్యాచ్లో ఆడే ప్లేయర్లు కూడా అంతే. వారు కూడా తమ శ్రమను మించి అడుతుంటారు. ప్రతి ప్లేయర్పై తీవ్ర ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడట. తాజాగా ఇదే విషయంపై ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.
“భారత్ – పాకిస్థాన్ టీమ్ మధ్య మ్యాచ్ అంటేనే వరల్డ్వైడ్గా ప్రతిఒక్క క్రికెట్ అభిమానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇతర మ్యాచుల్లో గెలిచినా గెలవకపోయినా.. పాకిస్థాన్పై మాత్రం టీమ్ఇండియా గెలవాలని అభిమానులు ఎంతో బలంగా కోరుకుంటుంటారు.
అలాంటప్పుడు ఇలాంటి మ్యాచ్పై అంచనాలు, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే 2003 వన్డే ప్రపంచకప్ మ్యాచ్కు ముందు నేను నిద్రపోలేదు. ఇక షోయబ్ బౌలింగ్లో కొట్టిన సిక్స్ నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన షాట్.
అయితే, ఇలాంటి షాట్ కొట్టాలని ముందగానే ప్లాన్ చేసుకోలేదు. సాధారణంగానే బరిలోకి దిగాను. బంతి గమనాన్ని అంచనా వేస్తూ.. అప్పటికప్పుడు అలాంటి షాట్ను కొట్టేయాలి. ఆ మ్యాచ్లోనూ అదే జరిగింది.
బంతి ఆఫ్సైడ్కు ఆవల వెళ్తున్నట్లు నాకు అనిపించింది. అంతే వెంటనే షాట్ బాదేందుకు ప్రయత్నించా. అది కాస్త సిక్స్ర్గా దూసుకెళ్లింది” అని సచిన్ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్లో సచిన్ 98 పరుగులు చేసి కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్ పాకిస్థాన్పై విజయం సాధించడంలో ఎంతో కీలకంగా మారింది.ఇకపోతే గతకొంతకాలంగా టెస్టు క్రికెట్లోనూ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. ఈ లాంగ్ ఫార్మాట్పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్ నంబర్వన్గా కొనసాగాలంటే ఎలాంటి ప్లాన్స్ రూపొందించాలనే విషయంపై సచిన్ మాట్లాడాడు.