నక్సలైట్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్న విరాట పర్వం సినిమా.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమయింది. అందులో భాగంగానే కర్నూలు వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రంగం సిద్ధం చేసింది చిత్ర యూనిట్.ఈ నేపథ్యంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. సాయిపల్లవి కోసమే ఈ సినిమా తీశామన్నట్టుగా రానా బదులిచ్చారు. రానా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
అంటే ఆమె పేరు చెప్తేనే విరాటపర్వంకు పబ్లిసిటీ వస్తుందా..? అనే తరహాలో దగ్గుబాటి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో చెప్పుకోవడానికి బలమైన కంటెంట్ ఉంది. నందితా దాస్, ప్రియమణి లాంటి టాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు.
దర్శకుడు వేణు ఊడుగుల చాలా పరిశోధన చేసి అప్పటి వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. బలమైన సంగీత సాహిత్యాలను సమకూర్చుకున్నారు. ఇన్ని ఉన్నా ఒక్క అంశం మీదే ఫోకస్ పెడుతున్నారు. నిజానికి లవ్ స్టోరీ టైంలోనూ సాయిపల్లవి బ్రాండ్ చాలా ప్లస్ అయ్యింది.
అయితే.. గతంలో సిటీ సెంటర్లలో నాగచైతన్యతో పాటు ఈమెకు కటౌట్లు బ్యానర్లు పెట్టడం.. ఆ ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ కావడం అందరూ చూశారు. కానీ.. తాజాగా వదిలిన విరాటపర్వం పోస్టర్ లోనూ సాయిపల్లవిని స్పష్టంగా చూపించి రానా మొహం మాత్రం కవర్ చేశారు. అసలే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని రిస్కీ డ్రామా ఇది. అలాంటిది ఒక పాయింట్ ని హైలైట్ చేయడం వల్ల అంచనాలు పక్కదారి పట్టే ఇబ్బంది లేకపోలేదంటున్నారు సినీ విశ్లేషకులు.