బెట్టింగులు వద్దని, ఇంట్లో దాచుకున్న డబ్బుతో క్రికెట్ బెట్టింగ్ ఆడితే ఎలా అని మందలించినందుకు తల్లిని, చెల్లినే పొట్టన పెట్టుకున్నాడు ఓ కిరాతకుడు. భోజనంలో రసాయన గుళికలు కలిపి ఇద్దరినీ చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచి భార్య సునీత, కుమారుడు సాయినాథ్రెడ్డి, కుమార్తె అనూషలు కలిసి జీవిస్తున్నారు. సునీత ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, సాయినాథ్రెడ్డి ఎంటెక్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది.
తండ్రి ప్రభాకర్రెడ్డి మృతిచెందిన సమయంలో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు, భూమి అమ్మకంతో వచ్చిన డబ్బంతాదాదాపు 20 లక్షలు బ్యాంకులో దాచారు. ఇటీవల సాయినాథ్రెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్ట్టింగ్లకు పాల్పడుతూ తీవ్రంగా నష్టపోయాడు. తన తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశాడు. ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను సైతం తీసుకెళ్లి, వాటిని అమ్మి బెట్టింగ్లకు పాల్పడే ప్రయత్నం చేయసాగాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కుమారుడిని నిలదీసింది. దీంతో వారిని అడ్డు తొలిగించుకోవాలనుకున్న సాయినాథ్ రెడ్డి వారిద్దరిని చంపేందుకు ప్లాన్ చేశాడు.
ఈ నెల 23న ఇంట్లో వండిన రాత్రి భోజనంలో రసాయన గుళికలు కలిపి విధులకు వెళ్లాడు. కానీ ఈ విషయం తెలియని తల్లి, చెల్లి ఆ అన్నం తిన్నారు. తమకు కడుపులో తిప్పినట్లుగా ఉందని, నువ్వు తీసుకెళ్లిన అన్నం తినవద్దని కొడుక్కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న సాయినాథ్రెడ్డి వారిని అపస్మారక స్థితికి చేరే వరకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. తర్వాత ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 27న అనూష, 28న సునీత మరణించారు. అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సాయినాథ్రెడ్డిని నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోద చేశారు.