టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నారు. అంతే రేంజ్ లో అభిమానుల మనసులను దోచుకున్నారు. అయితే.. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. జనాతా గ్యారేజ్ తో తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే.. ఆచార్యతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే సినిమాను పకడ్బందీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. సినిమా గురించి ప్రకటన విడుదల చేసి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ చిత్ర యూనిట్ హీరోయిన్ పేరును ప్రకటించలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు దీటుగా పని చేసేందుకు హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ తెగ వెతుకుతోందనే చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే హీరోయిన్ ఎవరనే దానిపై నెట్టింట రోజుకో పేరు వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక నుంచి మొదలు ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు వినిపించాయి. ట్రిపులార్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారడంతో బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండడం, నటనకు స్కోప్ ఉండే క్యారెక్టర్ కావడంతో సాయి పల్లవి అయితే బాగుంటుందని కొరటాల ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు.