కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం తాడేపల్లిలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రచారం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు దఫాలు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు. అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నారని వెల్లడించారు. అవినాష్ విషయంలో అనవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినాష్ రెడ్డి అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ పాలనను చూసి విపక్షాలు కడపుమంటతో రగిలిపోతున్నాయని అన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చారని తెలిపారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని చెప్పారు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. తన వ్యక్తి గత పనులకు వాడుకున్నారే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదని మండిపడ్డారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంపై ఓ మీడియా వర్గం దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన కీలకమైన ప్రాజెక్ట్ అని.. ఇటువంటి అంశాలపై చర్చ చేయరని.. రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని భ్రమ కల్పిస్తున్నారన్నారు.