బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టుపై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు సల్మాన్ ఖాన్, అతని బాడీగార్డ్ నవాజ్ షేక్కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అంధేరి కోర్టు ముందు వీరు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ అంధేరీ కోర్టు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు ఆదేశాలను కొట్టివేసి, తనకు ఉపశమనం కల్పించాలని కోరారు.
కాగా, 2019లో సల్మాన్ ఖాన్, అతడి బాడీగార్డు తనపై దాడి చేశారని అశోక్ పాండే అనే జర్నలిస్ట్ అంధేరీ కోర్టులో ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ బలవంతంగా లాక్కుని బెదిరించారని ఆరోపించారు. అంతే కాదు, సల్మాన్తో పాటు అతడి బాడీగార్డ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ముంబై రోడ్డులో సల్మాన్ సైక్లింగ్ చేస్తుండగా మీడియా ఆయన చూట్టు చేరి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో సల్మాన్ తన ఫోన్ లాక్కుని బెదించాడని, అతడి బాడీగార్డు నవాజ్ షేక్ కూడా తనతో దురుసుగా ప్రవర్తించినట్లు అతడు ఫిర్మాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్ పోలీసులను ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా అంధేరీ కోర్టు ఆదేశించింది.
ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్, ఆయన బాడీగార్డ్కు ప్రతికూలంగా ఉంది. దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. సల్మాన్, ఆయన బాడీగార్డ్పై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు మార్చి 23న సల్మాన్, ఆయన బాడీగార్డుకు నోటీసులు ఇచ్చి ఏప్రిల్ 5న విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.