బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ సినిమా.. మన దేశ ఔన్నత్యం, సంస్కృతి ని ప్రపంచదేశాలకు చాటి చెప్పే విధంగా ఉందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సినిమా చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా సహజసిద్ధ విశ్వాసంతో భారత్ పూర్వ వైభవానికి చేరుకునేలా చేస్తుందనే నమ్మకాన్నికలిగించిందని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని చెప్పారు.
1025లో సుదీర్ఘ ప్రయాణం ప్రారంభమైందని.. అందులో మహమ్మద్ గజనీతో పృథ్వీరాజ్ యుద్ధం ఓ భాగమని చెప్పారు. గజనీ గుజరాత్ పై దాడి చేసి సోమనాథ దేవాలయాన్ని దోచుకున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. భారత దేశానికి స్వాతంత్య్రం రావడంతో 1947లో ఈ సుదీర్ఘ ప్రయాణం ముగిసిందని పేర్కొన్నారు. భారత దేశంపైనా, భారతీయ సంస్కృతిపైనా అనేక మంది దాడి చేశారని పేర్కొంటూ వారిపై పోరాటం ఎన్నటికీ అంతం కాదని స్పష్టం చేశారు.
ఈ సినిమాలో పృథ్వీరాజును చూపించిన తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సినిమాను అద్భుతంగా చిత్రీకరించిన డైరెక్టర్ చంద్ర ప్రకాశ్ ద్వివేదీని, పృథ్వీరాజు పాత్రలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోసిన అక్షయ్ కుమార్ ను ప్రశంసించారు. వందలాది పుస్తకాలకు సాధ్యం కానంతటి స్థాయిలో ఓ సినిమా మన ఆత్మగౌరవాన్ని ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. వేలాది పేజీలు గల పుస్తకానికి సాధ్యం కాని రీతిలో రెండున్నర గంటల సినిమా ఓ మహా నాయకుడి పట్ల అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు అమిత్ షా.
కాగా, ‘పృథ్వీరాజ్’ సినిమాకి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను నుండి మినహాయింపు ప్రకటించింది. ఈ సినిమాను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తన కేబినెట్ తో కలిసి రాజ్ భవన్ లో స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూశారు. అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతి ఒక్క సామాన్యుడు ఈ చిత్రం వీక్షించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగీ తెలిపారు.