భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పింది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది సానియా. తన ఆటకు వీడ్కోలు పలుకుతూ ఆమె భావోద్వేగానికి లోనైంది. దుబాయ్ ఓపెన్ లో తొలి రౌండ్ లోనే ఓటమి ద్వారా ప్లేయర్ గా సానియా టెన్నిస్ కెరీర్ ముగిసిపోయింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో టెన్నిస్ ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే టెన్నిస్ మాత్రమే జీవితం కాదు. ప్రొఫెషనల్ అథ్లెట్ గా ఎదుగుతున్న సమయంలోనే అలా భావించాను. కాబట్టి ఏనాడూ ఓటమి భయం లేదు. ఓడితే మళ్లీ గెలవగలమనే ధైర్యంతోనే ఆడాను. పరాజయాలు నాపై ప్రభావం చూపలేదు. ఓడినప్పుడు కొద్దిసేపు బాధపడినా.. దీంతో ప్రపంచం ఆగిపోదని నాకు తెలుసు. డబుల్స్ కారణంగానే నాకు గుర్తింపు దక్కింది.
సింగిల్స్ లోనూ మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్-30లోకి వచ్చాను కాబట్టి అదీ గొప్ప ఘనతే. మణికట్టుకు ఆపరేషన్ తర్వాత సింగిల్స్ ఆడటం ఇబ్బందిగా మారింది. అందుకే డబుల్స్ కి మారాను. ఒలింపిక్ పతకం లేకపోయినా నేను సాధించినదాంతో సంతృప్తిగా ఉన్నా. నేను ట్రెండ్ సెట్టర్ గా భావించడం లేదు’అంటూ సానియా మీర్జా పేర్కొంది.
ఐదేళ్ల వయసులోనే రాకెట్ పట్టిన సానియా మీర్జా.. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించింది. మూడు డబుల్స్ గ్రాండ్ స్లామ్, మూడు మిక్స్ డ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి మరీ ఇతర భారత మహిళా టెన్నిస్ ప్లేయర్ కు సాధ్యం కాని రీతిలో రికార్డులు క్రియేట్ చేసింది. 43 డబుల్స్ ట్రోఫీలు సాధించింది. 91 వారాలు వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగింది.
View this post on Instagram