జిల్లా కలెక్టర్ పై సర్పంచ్ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. అది కూడా కలెక్టర్ పై కలెక్టర్ కే కంప్లైంట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని దమ్మయ్యపేట గ్రామ సర్పంచ్ తునికి నర్సయ్య గతంలో జిల్లా కలెక్టర్ గా పని చేసిన గుగులోతు రవిపై ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సర్పంచ్ తునికి నర్సయ్య మాట్లాడుతూ.. గతంలో జిల్లా కలెక్టర్ గా పని చేసిన గుగులోత్ రవి ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వడ్డరకాలనీలో ఉన్న ప్రైమరీ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని తనకు సూచించారని చెప్పాడు.
150 మీటర్ల పొడవు ఉన్న గోడ నిర్మాణాన్ని పూర్తి చేసిన వెంటనే డబ్బులు అందజేస్తామని కలెక్టర్ తనకు తెలిపాడని వివరించాడు. కానీ పనులు పూర్తి చేసి మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బిల్లులు రాలేదని, దయచేసి బిల్లులు మంజూరు చేయాలని ఫిర్యాదులో కోరాడు సర్పంచ్.
గ్రామంలో అప్పులు చేసి గోడ నిర్మించామని, సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు పేర్కొన్నాడు. ఒక గ్రామ సర్పంచ్ గత కలెక్టర్ పై ప్రస్తుత కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.