- డోర్నకల్ టీఆర్ఎస్ లో కుంపట్లు
- మంత్రి సత్యవతి వర్సెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ఆ
- ధిపత్య పోరుతో పార్టీలో అయోమయం
మహబూబాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్లో అసంతృప్త జ్వాలలు గుప్పుమంటున్నాయి. పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య విభేదాలతో పార్టీలో అయోమయం నెలకొంది. వీరిద్దరి వాగ్వాదంతో డోర్నకల్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ నడుస్తోంది.
మంత్రి సత్యవతి రాథోడ్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. శిశు, మహిళా సంక్షేమానికి సంబంధించిన విషయాలు తమకు తెలియడం లేదంటూ మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరిపెడ మండల కేంద్రంలో వికలాంగులకు సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించిన విషయాలేవీ తనకు తెలియడం లేదంటూ మండిపడ్డారు. ఇది అధికారుల తప్పిదమో లేక మంత్రి తప్పిదమో తెలియని పరిస్థితి నెలకొందని తీవ్ర విమర్శలు చేశారు.
గతంలో ఏ శాఖ నుంచి ఏ పథకం వచ్చినా స్థానిక ఎమ్మెల్యేను అడిగి అందించేవారని రెడ్యానాయక్ చెప్పారు. ప్రభుత్వ పథకాల గురించి చాలామంది లబ్ధిదారులు తమ దగ్గరకు వస్తుంటారని, అప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైనా పద్ధతి కాదని, కనీసం మీరు ఇచ్చే పథకాలైనా చెప్పుకోవాలి కదా..? అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సత్యవతి రాథోడ్ 5 వేలకు పైగా ఓట్ల తేడాతో రెడ్యానాయక్ పై విజయం సాధించారు. అయితే.. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె డోర్నకల్ రాజకీయ తెరపై తన ప్రతిభను చాటుకోలేకపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన సత్యవతి.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెడ్యా నాయక్ తన కూతురు, ఎంపీ కవితతో కలిసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఇద్దరు రాజకీయ ఆజాత శత్రువులు ఒకే పార్టీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
సిట్టింగులకే సీట్లు ప్రాతిపదికన 2018లో అసెంబ్లీ టికెట్లు ఖరారు కావడంతో రెడ్యా నాయక్ కే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. సత్యవతి రాథోడ్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అంతా అనుకుంటున్న సమయంలో గులాబీ బాస్ కొన్నాళ్లకే ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే.. అప్పటికే మంత్రి పదవి ఆశించిన రెడ్యానాయక్ కు నిరాశే ఎదురైంది.