రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడిని వారం రోజుల కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల 9 వరకు హరిహరకృష్ణను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు విచారించనున్నారు. హత్య ఒక్కడే చేశాడా.. ఎవరన్నా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హరిహరకృష్ణతో పాటు స్నేహితులు, కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించనున్నారు.
నిందితుడు డిలీట్ చేసిన వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను పోలీసులు రిట్రివ్ చేయనున్నారు. మృతుడు నవీన్ కాల్ డేటాను సైతం పరిశీలించనున్నారు. ఈ క్రమంలోనే సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేసిన కీలక ఆధారాలు సేకరించనున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్, బైక్, కత్తిని పోలీసులు సేకరించారు.
యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారిన హరిహర కృష్ణ.. నవీన్ ను ఎలా హత్య చేశాడో ఇంకా డీటెయిల్ గా తెలుసుకోనున్నారు. మరోవైపు హత్యకు కారణమైన యువతి ఏమీ నోరు విప్పడం లేదని తెలుస్తోంది. పోలీసులు ఎంత అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదట. నవీన్ దిల్ సుఖ్ నగర్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా హరికృష్ణతో పరిచయమైంది.
మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్ కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహరకృష్ణకు కూడా తెలుసు. నవీన్ బీటెక్ కోసం నల్గొండలోని ఎంజీఎం కాలేజీలో, హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్ అక్కడకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా హరి స్నేహం పెంచుకుని ప్రేమించడం మొదలుపెట్టాడు.
ఇది తెలిసి నవీన్ కూడా ఆమెకు టచ్ లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి ఆమెను దక్కించుకోవాలని మర్డర్ ప్లాన్ వేశాడు. నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం ప్రకారం హత్య చేశాడు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడ్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
కాగా నవీన్ హత్య కేసుపై నిందితుడు హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ స్పందించారు. తన కుమారుడు ఒక్కడే హత్య చేయలేదని దీని వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని ప్రభాకర్ వేడుకున్నారు.