భారత క్రీడా రంగంలో మరోసారి డోపింగ్ కలకలం సృష్టించింది. స్టార్ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు బంగారు పతకం గెలిచిన కే సంజిత చాను డోపింగ్ లో పట్టుబడింది. గతంలో కూడా సంజిత డోపింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంది. మళ్లీ ఇప్పుడు ఆమె మరోసారి పట్టుబడింది. సంజిత చాను డ్రొస్టనొలోన్ అనే ఉత్ప్రేరకం వాడినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై ప్రాథమిక నిషేధం విధించింది.
గత సెప్టెంబర్–అక్టోబర్ లో గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా మణిపూర్ కు చెందిన సంజిత చాను నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించారు. అందులో ఉత్ప్రేరకాన్ని గుర్తించారు.సంజిత కేసును ఇప్పుడు నాడా డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ విచారిస్తుంది.
సంజిత ఉద్దేశపూర్వకంగా డోపింగ్ కు పాల్పడినట్టు తేలితే ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం పడే అవకాశం ఉంది. గతేడాది బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సంజిత బంగారు పతకం గెలిచింది.
ఆమె గతంలో కూడా డోపింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంది. 2018 మేలో ఆమె శాంపిల్స్ లో టెస్టోస్టిరాన్ ను గుర్తించడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది. కానీ అధికారుల తప్పిదం కారణంగా సంజిత శాంపిల్ మిక్సింగ్ అయినట్టు గుర్తించడంతో 2020లో ఆమెపై వేటును తొలగించారు. అయితే మళ్లీ ఇప్పుడు సంజిత చాను వార్తల్లో నిలిచింది.